కొద్దిరోజులుగా పైపైకి ఎగసిన బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండటం, స్టాక్మార్కెట్ల కుదేలుతో గత కొద్దిరోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత సెషన్ లో 10 గ్రాముల బంగారం ఏకంగా రూ 47,327కి చేరి సరికొత్త శిఖరాలను తాకింది. అయితే రికార్డు ధరల నుంచి ఈరోజు ఒక్కరోజే ఎంసీఎక్స్ లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1,396 తగ్గి రూ 45,862 పలికింది. మరోపక్క కిలో వెండి రూ. 1,342 తగ్గి రూ. 42,913కి చేరింది. ఇక భారత్లో మే 3వరకూ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో బంగారం రిటైల్ విక్రయాలు పడిపోవడం వలన కూడా ఈ ధరలు కొంతమేర దిగివచ్చాయని అంచనా వేస్తున్నారు. అటు అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది నెలలు బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య సాగవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారీగా తగ్గిన పసిడి ధరలు